కలం, నిర్మల్ : బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో దాదాపు 20 వేల ఖాళీలు ఉన్నప్పటికీ కేవలం 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుత నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్యను పెంచి అన్ని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల హామీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. జీఓ-46 కారణంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని, కమిషనరేట్ల వారీగా వేర్వేరు కటాఫ్లు అమలు చేయడం వల్ల ప్రతిభావంతులైన అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు. నియామకాలలో జాప్యం కారణంగా వయోపరిమితి దాటుతున్న అభ్యర్థులకు జీఓ-87 ద్వారా తక్షణ ఉపశమనం కల్పించాలని సూచించారు.
రాష్ట్రంలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాలు, ఖాళీలు, పెండింగ్ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ ఉద్యోగాల కోసం న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగ లేఖ ద్వారా మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) కోరారు.
Read Also: తెలంగాణ టీ20లో మెరిసిన నిర్మల్ యువ క్రికెటర్
Follow Us On: Sharechat

