కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ (Palvancha) పట్టణంలోని, జయమ్మ కాలనీ వద్ద బైపాస్ రోడ్డులో మిషన్ భగీరథ (Mission Bhagiratha) పైప్లైన్ లీక్ అవ్వడంతో 20 మీటర్ల ఎత్తున నీళ్లు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే రెండు సార్లు దీనికి మరమ్మతులు చేసినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక కార్పొరేటర్ పట్టించుకోకపోవడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ప్రెషర్తో నీళ్లు పైకి ఎగిసిపడుతుండటం వలన చుట్టుపక్కల వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాలనీ మొత్తం జలమయమైన పరిస్థితి నెలకొంది. ఎదురుగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ పై నీళ్లు ఎగిసి పడుతుండటంతో రోడ్డు మీద వెళ్లాలంటేనే భయం వేస్తుందని పరిసర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. కాబట్టి అధికారులు ఈ సారైనా మరమ్మతులు నాణ్యతతో చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

