కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో ఉన్న భూసేకరణ, పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ, పరిహారం, పునరావాస అంశాలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ సమీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణ పనులు సకాలంలో పూర్తయి కొత్త ఆయకట్టు అందుబాటులోకి రావాలంటే పెండింగ్ భూసేకరణను త్వరగా ముగించాల్సి ఉందన్నారు. భూసేకరణ ప్రక్రియ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని వెల్లడించారు. నిధులు అందుబాటులో ఉన్నందున కలెక్టర్లు ఎక్కడా జాప్యం లేకుండా పనులకు ఆటంకం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులతో మాట్లాడారు. మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ, రైతులకు పరిహారం చెల్లింపు, పునరావాస ప్రక్రియలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణలో ఏవైనా సమస్యలు ఎదురైతే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి ప్రాజెక్టుల పనులు సజావుగా సాగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, భూసేకరణ ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

