కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా మధిర (Madhira) పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ కిలాడీ దొంగ హల్చల్ చేశాడు. స్థానిక చెరుకుమల్లి వారి వీధిలో ఉన్న ప్రసిద్ధ శ్రీ గీతా మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని చోరీకి తెగబడ్డాడు. ఆలయంలోకి గుట్టుచప్పుడు కాకుండా ప్రవేశించిన ఆ గుర్తుతెలియని వ్యక్తి, విలువైన వస్తువులను కాజేసేందుకు యత్నించాడు.
అయితే, ఆలయం వద్ద జరుగుతున్న అనుమానాస్పద కదలికలను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ చోరుడి యత్నాన్ని తిప్పికొట్టడమే కాకుండా, నిందితుడిని పట్టుకున్నట్లు సమాచారం. ఈ చోరీ యత్నానికి సంబంధించిన దృశ్యాలన్నీ ఆలయంలో అమర్చిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.
పట్టణ నడిబొడ్డున ఉన్న ఆలయంలోనే దొంగతనానికి తెగబడటంతో స్థానికులు, భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆలయాల వద్ద రాత్రి వేళల్లో పోలీసు పెట్రోలింగ్ పెంచి భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

