కలం, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లి(Racharla Gollapalli) గ్రామంలోని ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్లో గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. సీసీ కెమెరాను కిందికి వంచి, షట్టర్ తాళాలు పగలగొట్టి దుకాణంలోకి ప్రవేశించిన దుండగులు వస్తు సామగ్రిని అపహరించారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుడు పాతూరి రాజేశ్వర్రెడ్డి గురువారం రాత్రి దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో దుండగులు షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన సామగ్రిలో కొంత ఉన్న ఓ సంచిని దుకాణం ముందే వదిలి వెళ్లారు.
శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ యజమాని దుకాణం తెరిచేందుకు రాగా సూపర్ మార్కెట్ షట్టర్ తెరిచి ఉండటాన్ని గమనించారు. తాళాలు పగలగొట్టి ఉండటంతో వెంటనే రాజేశ్వర్రెడ్డికి సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చోరీకి సంబంధించిన ఆధారాల కోసం డాగ్స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. ఎస్ఐ రమేష్గౌడ్ సంఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీలో ఎంత మొత్తంలో వస్తు సామగ్రి అపహరణకు గురైందనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

