కలం, ఖమ్మం బ్యూరో: రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ (Congress) పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) సూచించారు. శనివారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఓటర్ల జాబితా నవీకరణ, అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు కీలక మార్గదర్శకాలు అందించారు.
మంత్రి మాట్లాడుతూ, గతంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ (Mamata Banerjee), తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వాలు ఓటర్ల జాబితా సవరణల ప్రభావంతోనే ఇబ్బందులు ఎదుర్కొన్నాయని వ్యాఖ్యానించారు. అందువల్ల ఓటర్ల జాబితా ప్రక్రియను తేలికగా తీసుకోకూడదని సూచించారు. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గంలో ఓటర్ల మ్యాపింగ్ అనుకున్న స్థాయిలో లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ లోపాలను సరిదిద్దడానికి బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓటర్ల నవీకరణ వంటి అంశాలలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala) కోరారు.
Read Also: సిరిసిల్ల సీట్.. పెరుగుతున్న పొలిటికల్ హీట్!
Follow Us On : WhatsApp

