కలం, ఖమ్మం బ్యూరో : సర్పంచ్లు గ్రామాలను సుందరంగా తీర్చి దిద్దాలని పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క (Minister Seethakka) పిలుపునిచ్చారు. ఆదివారం నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన సభలో ఆమె మంత్రి పొంగులేటి (Minister Ponguleti) తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఇప్పటికే 1000 కోట్లు విడుదల అయ్యాయని అన్నారు. మరో 1000 కోట్లు కూడా తొందర్లోనే వస్తాయి. సర్పంచులు అభివృద్ధి పనుల వేగం పెంచి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలని అన్నారు. ఎన్నికలు వచ్చే నాటికి ఎన్నుకున్న గ్రామానికి ఏం చేశామో చెప్పుకునే స్థితిలో సర్పంచ్లు ఉండాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు పక్షపాతం లేకుండా జరగాలని తెలిపారు.
సర్పంచ్లు వంద రోజుల పనులను ఒక లక్ష్యంగా పెట్టుకొని చేయించాలి. అప్పుడే మనకు నిధులు అధికంగా వస్తాయని అన్నారు. మహిళా సంఘాలు కూడా ఇంకా విస్తృతంగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకునే మహిళా సంఘాల సభ్యులకు లక్ష రూపాయల వరకు ఋణాలు ఇప్పిస్తున్నామనీ తెలిపారు. సర్పంచ్లు అహర్నిశలు గ్రామాల అభివృద్ధికి పాటుపడి ఉత్తమ సర్పంచ్ లుగా అవార్డు తీసుకునే స్టేజ్కి ఎదగాలని సీతక్క(Minister Seethakka) ఆశా భావం వ్యక్తం చేశారు.

