కలం, నల్లగొండ బ్యూరో : చిట్యాల పట్టణానికి మహిళా సంఘాల తరపున రైసు మిల్లును మంజూరు చేస్తామని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) హామీ ఇచ్చారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో శనివారం మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క వెల్లడించారు. చిట్యాల మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తుకు ఓటేసి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించామని మంత్రి సీతక్క వివరించారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) మాట్లాడుతూ.. చిట్యాల పట్టణంలో 850 మంది పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అవసరం ఉందన్నారు. మహిళా సంఘాల వారు రైస్ మిల్లును మంజూరు చేయాలని కోరుతున్నారని తెలిపారు. గత పదేండ్ల పాలనలో పేదలకు సరైన ఇండ్ల కేటాయింపులు జరగలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పున్న కైలాష్ నేత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read Also: కాంగ్రెస్ కు కంచుకోటగా నల్లగొండ : మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: Pinterest


