కలం, కరీంనగర్ బ్యూరో: గాడ్సే వారసులైన బీజేపీ నేతలు గాంధీ గురించి మాట్లాటడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) బండి సంజయ్కు కౌంటర్ ఇచ్చారు. జాతిపిత గాంధీని కాల్చిచంపిన గాడ్సే వారసత్వం బీజేపీదేనని మండిపడ్డారు. గాడ్సే వారసులుగా ‘విభజించు పాలించు’ అనే మతతత్వ వాదానికి బీజేపీ ప్రతిజ్ఞ చేస్తోందని ఆరోపించారు. కరీంనగర్లో క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకల్లో పొన్నం పూజలు చేసి మీడియాతో మాట్లాడారు.
అన్ని రంగాల్లో అన్ని మతాలు, కులాలు ప్రపంచ దేశాలతో పోటీపడేలా నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ వరకు చేసిన సంస్కరణలే నిదర్శనమన్నారు. గుజరాత్లో సబర్మతి డెవలప్ చేసుకోగా ఇక్కడ మూసీ డెవలప్ చేసుకుంటే తప్పేంటి? అని మంత్రి ప్రశ్నించారు. మోడీ తన పాలనలో మాటల గారడి తప్ప దేశానికి, తెలంగాణకు నిర్మాణాత్మకంగా చేసిందేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ అవమానపరిచారని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం బీజేపీ (BJP) ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జాతీయగీతాన్ని ఎవరైనా గౌరవించాల్సిందేనని పొన్నం స్పష్టం చేశారు. ఏదైనా ఫిర్యాదు ఉంటే శాసనసభాపతి దృష్టికి తీసుకురావాలి. కానీ భావోద్వేగాల విషయంలో మీడియాకు తెలియజేయడం సరికాదన్నారు.
మూసీ నిర్వాతులకు న్యాయం చేసిన తర్వాతనే ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని, నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని మంత్రి పొన్నం వెల్లడించారు. ప్రాజెక్టును అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మూసీ అభివృద్ధి చేసి పేదలకు జీవనోపాధి కల్పిస్తామని, అందుకు బీజేపీ, బీఆర్ఎస్లు సహకరించాలన్నారు. ఉగాది సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా పంటలు పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. మంత్రి వెంట సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కార్పోరేటర్ అంజన్ కుమార్, అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఉన్నారు.

