కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నగరంలో ఆదివారం పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లి బోనాల వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. నగరంలోని శ్రీపురం కాలనీ, చింతకుంట, కిసాన్ నగర్, కట్ట రాంపూర్ ప్రాంతాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ బోనాల వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా అమ్మవారి బోనం ఎత్తుకుని ఆలయం వరకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గంగుల కమలాకర్ (Gangula Kamalakar) మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతుల పంటలు బాగా పండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్ల హరి శంకర్, 40వ డివిజన్ కార్పొరేటర్ నలువాల పుష్పలత రవీందర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, పలువురు నాయకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం
Follow Us On : WhatsApp

