కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని కూరెళ్ల గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam) దుక్కి దున్ని విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అన్నారు.
రైతు కొత్త వ్యవసాయ పనులను ప్రారంభిస్తూ, భూమాతకు, ప్రకృతికి నమస్కరించి మంచి పంటలు పండాలని కోరుకునే పవిత్రమైన రోజు అని మంత్రి చెప్పారు. తెలంగాణ లో సమృద్ధిగా వర్షాలు పడి రైతులు పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భూమాత ను ప్రార్థిస్తున్నానన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని… అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.

