కలం, ఖమ్మం బ్యూరో: వంద ఏళ్ల వయసు.. దశాబ్దాల నిరీక్షణ.. కళ్ల నిండా కన్నీరు.. ఆ వృద్ధురాలి దీనగాథ వింటే ఎవరికైనా మనసు కరుగుతుంది. కానీ, ఆ కన్నీటిని తుడిచేందుకు కేవలం మాటలు సరిపోవని, చేతలు కావాలని నిరూపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy). మంగళగూడెం ప్రజా దర్బార్లో మొదలైన ఒక బామ్మ ఆవేదన, కేవలం 72 గంటల్లోనే పరిష్కారం దిశగా అడుగులు వేయడం ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మంగళవారం జరిగిన ‘ప్రజా దర్బార్’లో 104 ఏళ్ల వెలుతురు భద్రమ్మ తన భూమి సమస్యను విన్నవించుకోవడానికి వచ్చినప్పుడు ఆ దృశ్యం అందరినీ కలిచివేసింది.
దశాబ్దాలుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం దొరకని వృద్ధురాలి గోడును విన్న మంత్రి పొంగులేటి ఆమెను దగ్గరకు తీసుకుని “నీకు నేనున్నా బామ్మా.. ఇది నీ బిడ్డ ప్రభుత్వం” అంటూ అభయమిచ్చారు. మంత్రి ఆదేశాలు కేవలం వేదికపైకే పరిమితం కాలేదు. “ఆ బామ్మను ఈ వయసులో ఇబ్బంది పెట్టవద్దు, క్షేత్రస్థాయికి వెళ్లి తక్షణమే నివేదిక ఇవ్వండి” అన్న మంత్రి గొంతులో ఉన్న గాంభీర్యం అధికారుల్లో కదలిక తెచ్చింది. దీంతో రెవెన్యూ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, సర్వేయర్ సతీష్ రెడ్డి బృందం నేరుగా గోళ్లపాడు చేరుకుంది. వివాదంలో ఉన్న భూమిని రికార్డులతో సరిపోల్చారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న చిక్కుముడులను విప్పేందుకు పూర్తి వివరాలు సేకరించారు. దశాబ్దాల సమస్యకు మరికొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం లభించనుందనే ఆశ భద్రమ్మ మొహంలో కనిపిస్తోంది. యంత్రాంగం ఇంత వేగంగా కదలడంపై స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

