కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఆర్సీపురంలోని రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్లో ఇరుక్కుని నాలుగేళ్ల బాలుడు గిరిధర్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వెంకటేశ్వర్లు కాలనీలోని ఓ అపార్ట్మెంట్కు వాచ్మెన్గా పని చేస్తున్నాడు. అక్కడే తన భార్య, కొడుకుతో కలిసి ఉంటున్నాడు. కొడుకు గిరిధర్ శుక్రవారం రాత్రి ఆడుకుంటూ వెళ్లి లిఫ్ట్ లో ఎక్కి ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ శబ్దం రావడంతో వెంకటేశ్వర్లు దంపతులు అప్రమత్తమయ్యారు. బాలుడు లిఫ్ట్లో ఇరుక్కున్నట్లు గుర్తించి అతడిని బయటకు తీశారు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గిరిధర్ మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

