కలం, ఖమ్మం బ్యూరో: ఇందిరమ్మ ఇండ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti) మరోసారి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని, గతంలో సేకరించి ఆక్రమణలకు గురైన భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు నివాస స్థలాల పట్టాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. 173 మంది లబ్ధిదారులకు రూ. 50.86 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు, మల్లెపల్లిలో 16 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మునిగేపల్లిలో 12 మందికి స్థలాల పట్టాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నామని స్పష్టం చేశారు. పేదల వైద్యం కోసం ఇప్పటివరకు రూ. 3,250 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను పూర్తి చేసేందుకు రూ. 1,100 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. అంతకుముందు మేడిదేపల్లిలో రూ. 220 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, సీపీ సునీల్ దత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

