కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక (Pinapaka) నియోజకవర్గాన్ని (Minister Ponguleti) సాగునీటి రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ పనులు, నిధుల మంజూరుపై ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదన్నారు. సాంకేతిక, పరిపాలనా అనుమతులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. రైతులకు తక్షణ ప్రయోజనం చేకూరేలా క్షేత్రస్థాయిలో పనులు పరుగులు పెట్టించాలన్నారు.
అనంతరం పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు. మంత్రి పొంగులేటి సహకారంతో నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. అందులో భాగంగా అశ్వపురంలోని మారెళ్ళపాడు లిఫ్ట్ ఇరిగేషన్ త్వరలోనే అందుబాటులోకి రానుందన్నారు. అలాగే పులుసుబొంత ప్రాజెక్టు, దోమలవాగు చెరువు మినీ రిజర్వాయర్, రేగులగండి ప్రాజెక్టు పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ శాఖకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

