కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ సభలను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జూన్ 9 నుంచి 20 వరకు రాష్ట్రంలోని కీలక నగరాలలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయని మంత్రి పేర్కొన్నారు. జూన్ 9న తిరుపతిలో, జూన్ 12న అమరావతిలో, జూన్ 15న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సభల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సమన్వయంతో పనిచేస్తున్నాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్డీయే కూటమి విజయాలను ప్రజలలోకి తీసుకెళ్లడం, ప్రభుత్వ పనితీరుపై అవగాహన కల్పించడం ఈ సభల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఈ సభలలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

