కలం, వరంగల్ బ్యూరో : భోగి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రం ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ (Konda Surekha), వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేదమంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఎమ్మెల్యేలు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.
భక్తులకు తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత వంటి మౌలిక వసతులు సమృద్ధిగా అందుతున్నాయా లేదా అని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని సూచించారు. అలాగే ఐనవోలు జాతర (Inavolu Jatara) సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్స్టాండ్ను మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు బస్సులో ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ… భోగి పర్వదినాన ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఐనవోలు ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. దేవాలయాల అభివృద్ధి, బ్రహ్మోత్సవాలు, జాతరల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను సురేఖ (Konda Surekha) ఆదేశించారు. స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు, సుభిక్షం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, ఆలయ ఈవో సుధాకర్, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Also: జర్నలిస్టులపై కేసులు.. మైలేజ్ బాటలో రాజకీయ పార్టీలు
Follow Us On : WhatsApp


