కలం, మెదక్ బ్యూరో : అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ వచ్చి తమ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో మంత్రి మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని, ఈ సారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చే సలహాలు సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. సభకు వచ్చి చేసిన మంచి పనుల గురించి కేసీఆర్ చెబితే ఆయనకే గౌరవం పెరుగుతుందని తెలిపారు.
మూసిపై కేటీఆర్ ప్రజంటేషన్ ఇస్తే నవ్వు వస్తుందని ఎద్దేవా చేశారు. మూసితో నల్గొండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫ్లోరైడ్ సమస్యతో ఎన్ని ఇబ్బందులు పడ్డామో నల్గొండ ప్రజలకు తెలుసన్నారు. తమ ప్రభుత్వం అనేక మంచి పనులు చేస్తున్నదని చెప్పుకొచ్చారు. ‘ఆనాడు కేసీఆర్ ఇచ్చే దొడ్డు బియ్యం ఎవరూ తినలేదు.. రేషన్ డీలర్లకే అమ్ముకున్నారు. మేము తెల్లకార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తున్నం’ అని మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) పేర్కొన్నారు.

