కలం, నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో హ్యామ్ విధానంలో చేపట్టనున్న రూ.13,000 కోట్ల విలువైన చారిత్రాత్మక రోడ్డు అభివృద్ధి పనులకు ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా నల్లగొండ (Nalgonda) జిల్లా కనగల్ ప్రాంతంలో తెలంగాణలోనే అత్యంత భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు.
‘హ్యామ్’ నమూనాలో 6,300 కిలోమీటర్ల రహదారులు
కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన ‘హ్యామ్’ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6,300 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం 34 ప్యాకేజీల్లో టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, ఇప్పటికే వర్క్ ఆర్డర్లు కూడా జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం గత ఏడాది కాలంగా నిరంతరం కృషి చేశామని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు మంత్రి సీతక్క ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ ద్వారా మరో రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనులు కూడా త్వరలోనే చేపట్టనున్నట్లు మంత్రి (Minister Komatireddy) వివరించారు.
“ఈ మార్గాల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నందున ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ విస్తరణ పనులు చేపట్టాం. ఈ ప్రాజెక్టులతో రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు, పెట్టుబడులు భారీగా తరలివస్తాయి.” అని పేర్కొన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు నిరంతరాయంగా 24 గంటల పాటు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం రూ.125 కోట్లతో కొత్త వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు ఆమోదం తెలిపిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన రోజే ఈ ప్లాంట్కు కూడా వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. రోడ్ నెట్వర్క్ లో రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిలపడంతో పాటు, నల్లగొండ జిల్లాను తెలంగాణలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి పునరుద్ఘాటించారు.
Read Also: ప్రధానిగా మోదీ రికార్డ్.. ఎన్డీఏ కూటమి ప్రత్యేక సమావేశం
Follow Us On : WhatsApp

