కలం, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా దేశానికే ఆదర్శంగా నిలిచే కార్యక్రమాలను అమలు చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా, వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి పేర్కొన్నారు. మహిళా శక్తి పథకం కింద మండల మహిళా సమాఖ్యలు తమ సొంత నిధులైన రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 RTC బస్సులను కొనుగోలు చేసి సంస్థకు అద్దెకు ఇవ్వడం మహిళల ఆర్థిక స్వావలంబనకు, సమిష్టి శక్తికి ప్రతీకగా నిలిచిందన్నారు.
ఒకప్పుడు రుణాల కోసం ఎదురుచూసిన స్వయం సహాయక సంఘాల మహిళలు.. నేడు ఆస్తుల యజమానులుగా, పెట్టుబడిదారులుగా ఎదగడం తెలంగాణ ప్రభుత్వ మహిళా సాధికారత విధానాలకు నిదర్శనమని మంత్రి తెలిపారు. ఒక్కో బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా ప్రతి నెల రూ.3.84 కోట్ల ఆదాయం మహిళా సమాఖ్యలకు అందుతోందన్నారు.
ఇప్పటివరకు రూ.20.34 కోట్ల అద్దె ఆదాయం మహిళా సంఘాలకు చేరడం ఈ పథకం విజయాన్ని స్పష్టంగా చాటుతోందని మంత్రి (Minister Ponnam Prabhakar) చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళలు కేవలం లబ్ధిదారులుగా కాకుండా ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు, ఆస్తుల యజమానులు, ఆదాయ సృష్టికర్తలుగా మారుతున్నారని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కూడా ఈ పథకం ఎంతో దోహదపడుతోందన్నారు. అదేవిధంగా మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) విజయవంతమైన అమలులో ఈ బస్సులు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఇప్పటివరకు 315 కోట్లకు పైగా మహిళా ప్రయాణికులు లబ్ధి పొందారని చెప్పారు. ఈ పథకం ద్వారా మహిళలు సుమారు రూ.10,950 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకోగలిగారని పేర్కొన్నారు.
మహిళలు ఆదా చేసుకున్న ఈ మొత్తాన్ని కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాల కోసం వినియోగిస్తున్నారని మంత్రి వివరించారు. మహిళల చేతిలో మిగిలే ప్రతి రూపాయి కుటుంబ అభివృద్ధికి, సమాజ పురోగతికి దోహదపడుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మహిళా సమాఖ్యలకు మొత్తం 61 బస్సులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో కరీంనగర్ జిల్లాకు 16, రాజన్న సిరిసిల్ల జిల్లాకు 12, పెద్దపల్లి జిల్లాకు 15, జగిత్యాల జిల్లాకు 18 బస్సులు కేటాయించామని చెప్పారు.
దీంతో ఆయా జిల్లాల్లో బస్సుల కొరత తగ్గి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందడంతో పాటు మహిళా సంఘాలు స్థిరమైన ఆదాయ వనరును పొందనున్నాయని మంత్రి పేర్కొన్నారు. మహిళలను లబ్ధిదారుల నుంచి యజమానులుగా, భాగస్వాములుగా తీర్చిదిద్దడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని.. మహిళా శక్తి పథకం దిశగా దేశానికే ఆదర్శంగా నిలిచే విప్లవాత్మక కార్యక్రమం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
Read Also: 2047 వరకు మోదీయే ప్రధాని: బండి సంజయ్
Follow Us On : WhatsApp

