కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అధికారులను ఆదేశించారు. శనివారం నాగర్కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్తో పాటు నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టులు, నియోజకవర్గాల వారీగా భూసేకరణ పురోగతిని మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జిల్లా సమీక్షా సమావేశంలో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. సెప్టెంబర్ 15లోగా భూ సేకరణ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. రైతుల అభ్యంతరాలు, భూవివాదాలు, పరిహారం చెల్లింపులను ప్రత్యేకంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి శుక్రవారం భూసేకరణపై సమీక్ష..
జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నెట్టెంపాడు, గట్టు ఎత్తిపోతల పథకాలతో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి భూసేకరణకు రెవెన్యూ, ఇరిగేషన్, సర్వే అధికారులతో ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం భూసేకరణ విషయంపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నామన్నారు. జిల్లా పరిధిలో భూసేకరణ ప్రక్రియపై సమగ్ర నివేదికలను సమర్పించారు.
భూసేకరణలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సమావేశంలో వివరించారు. అనంతరం నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, నాగర్కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి , జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, సర్వే, నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Read Also: ప్లీజ్ ప్రధాని మోదీ.. ఈసారి తప్పు చేయొద్దు: రాహుల్ గాంధీ
Follow Us On: X(Twitter)

