కలం, వనపర్తి: రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (RDO) స్థాయిలో ప్రజావాణి నిర్వహణ అవసరం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, ప్రజావాణి ఇన్చార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి (Chinna Reddy) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టం చేశారు. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలే ప్రజల సమస్యల పరిష్కారానికి సరిపోతాయని పేర్కొన్నారు.
ఆర్డీవో కార్యాలయాలు ఎక్కువగా కలెక్టరేట్ ఆవరణలో లేదా సమీప ప్రాంతాలలోనే ఉంటాయని తెలిపిన ఆయన, మండలం–జిల్లా స్థాయి ప్రజావాణిల మధ్య మరో స్థాయిగా ఆర్డీవో స్థాయిలో ప్రజావాణి నిర్వహించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం ఉండదని అన్నారు . ప్రజల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ చిన్నారెడ్డి సూచించారు. సమస్యల పరిష్కారం వేగంగా, సమర్థవంతంగా జరిగేలా ప్రస్తుత విధానాన్ని పునఃసమీక్షించాలని అభిప్రాయపడ్డారు. ఆర్డీవో స్థాయి ప్రజావాణి నిర్వహణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులు మరోసారి సమీక్షించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.

