కలం, కరీంనగర్ : ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెను ముప్పని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman) అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది భూంరెడ్డి ధర్మపురి క్షేత్రంలో వివిధ అవసరాల నిమిత్తం క్లాత్ బ్యాగులు అందించడానికి ముందుకు వచ్చారు. శనివారం ఉదయం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్లాత్ బ్యాగులను, పర్యావరణ పరిరక్షణ క్యాప్ లను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మాట్లాడుతూ.. ప్లాస్టిక్ రహిత ధర్మపురి లక్ష్యంగా ధర్మపురి క్షేత్రంలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి వివరించారు. ఇందులో భాగంగా స్వచ్ఛ గోదావరి, ప్లాస్టిక్ రహిత ధర్మపురి నినాదాలతో ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఇందుకు అధికారులు సైతం ప్రత్యేక చొరవ తీసుకోవాలని మంత్రి సూచించారు.

