కలం, ఖమ్మం బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా పినపాక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు (Rega Kantha Rao) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, జిల్లా ప్రజాప్రతినిధుల మౌనాన్ని ఎండగడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ.. గతంలో ఓటుకు నోటు కేసులో డబ్బు సంచితో అడ్డంగా దొరికిపోయిన చరిత్ర రేవంత్ రెడ్డిదని, అలాంటి వ్యక్తి నేడు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఫైరయ్యారు.
అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ, డబ్బు కట్టలతో ఈడీ అధికారులకు అడ్డంగా దొరికినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం బీజేపీతో చేసుకున్న చీకటి ఒప్పందమేనని సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలోని అధికార పార్టీతో లోపాయికారీ పొత్తు పెట్టుకోవడం వల్లే పొంగులేటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
మరోవైపు జిల్లా ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జలాలను యథేచ్ఛగా ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటే, జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నోరు మెదపకుండా మౌనంగా ఉంటున్నారని మండిపడ్డారు. తమ స్వార్థ రాజకీయాల కోసం జిల్లా ప్రజల నోళ్లు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పినపాక నియోజకవర్గంతో పాటు జిల్లా ప్రగతిపై తాము చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అధికార పార్టీ నేతలకు సవాలు విసిరిన రేగా కాంతారావు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

