కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ (Sriram Sagar Project) బ్యాక్వాటర్ ప్రాంతంలో వలస పక్షుల(Migratory Birds) సందడి కొనసాగుతోంది. ఖండాలు, దేశాలను దాటి వలస వచ్చిన ఈ విహంగాలు డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, జీజీ నడ్కుడ, చిన్న యాన ప్రాంతాలలో వేసవి విడిది చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి కూడా నిర్వహిస్తున్నాయి. ఒక చోటు నుంచి మరోచోటికి గాల్లో ఎగురుతూ, నీటిపై ల్యాండ్ అవుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఆహారం కోసం చేపలు, రొయ్యలు, చిన్న పురుగులను వేటాడుతూ సహజ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి.
ప్రధానంగా ఫ్లెమింగోలు, పెలికాన్లు, హిమంటోపస్ జాతులు, ఓపెన్బిల్, గ్లోసీ ఐబిస్ వంటి అరుదైన పక్షులు గత ఐదేళ్లుగా ఈ ప్రాంతాలకు వలస వస్తూ సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే అనేక జాతుల పక్షులు తిరుగు ప్రయాణం ప్రారంభించగా, కొన్ని పక్షులు ఇంకా బ్యాక్వాటర్ ప్రాంతంలోనే నిలిచి ఉన్నాయి. సంతానోత్పత్తి లేదా ఇతర కారణాల వల్ల మిగిలిన ఈ పక్షులు మరో వారం పది రోజులలో తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.

