కలం, వెబ్ డెస్క్: ఆసియా స్పోర్ట్స్ (Asian Sports) 2026 కోసం భారత్ తన బ్యాడ్మింటన్ జట్టును ఖరారు చేసింది. జపాన్లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ ప్రతిష్టాత్మక పోటీలు జరగనున్నాయి. ఈ స్పోర్ట్స్కు పీవీ సింధు (PV Sindhu), లక్ష్యసేన్, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి వంటి స్టార్ ఆటగాళ్లతో బలమైన జట్టును భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రకటించింది. గత ఆసియా క్రీడల్లో పురుషుల డబుల్స్లో స్వర్ణ పతకం గెలిచిన సాత్విక్-చిరాగ్ జోడీ మరోసారి భారత ఆశలను మోసుకెళ్లనుంది.
రెండుసార్లు ఆసియా క్రీడల పతక విజేతగా నిలిచిన పీవీ సింధు మహిళల జట్టుకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పురుషుల విభాగంలో ప్రపంచ టాప్-10లోకి తిరిగి వచ్చిన లక్ష్యసేన్తో పాటు హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్లకు కూడా చోటు దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల మెరుగైన ఫలితాలు సాధించిన అయుష్ శెట్టి, తన్వీ శర్మ, ఉన్నతి హూడాలకు కూడా అవకాశం కల్పించారు.
అనుభవం, యువ ప్రతిభ కలయికతో ఈ జట్టును ఎంపిక చేసినట్లు భారత బ్యాడ్మింటన్ సంఘం తెలిపింది. ఆసియా క్రీడల చరిత్రలో భారత్ ఇప్పటివరకు 13 పతకాలు గెలుచుకుంది. 2022 ఎడిషన్లో ఒక స్వర్ణం, ఒక రజతం, ఒక కాంస్యం సాధించడం ద్వారా అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అదే జోరును ఈసారి కూడా కొనసాగించాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.
భారత జట్లు ఇవే..
టీమ్ ఛాంపియన్షిప్:
పురుషుల జట్టు: లక్ష్యసేన్, అయుష్ శెట్టి, హెచ్.ఎస్. ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్, తరుణ్ మన్నేపల్లి, సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, హరిహరన్ ఆమ్సకరుణన్, ఎం.ఆర్. అర్జున్, ధృవ్ కపిలా
మహిళల జట్టు:
పీవీ సింధు, ఉన్నతి హూడా, దేవికా సిహాగ్, తన్వీ శర్మ, ఇషారాణి బరువా, త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ పుల్లెల, కావిప్రియ సెల్వం, సిమ్రాన్ సింఘి, తనిషా క్రాస్టో
సింగిల్స్ ఛాంపియన్షిప్:
పురుషుల సింగిల్స్:
లక్ష్యసేన్, అయుష్ శెట్టి
మహిళల సింగిల్స్:
పీవీ సింధు, ఉన్నతి హూడా
పురుషుల డబుల్స్:
సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి; హరిహరన్ ఆమ్సకరుణన్/ఎం.ఆర్. అర్జున్
మహిళల డబుల్స్:
త్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్ పుల్లెల; కావిప్రియ సెల్వం/సిమ్రాన్ సింఘి
మిక్స్డ్ డబుల్స్:
ధృవ్ కపిలా/తనిషా క్రాస్టో
భారత బ్యాడ్మింటన్ జట్టు ఈసారి కూడా పతకాల వేటలో బలమైన పోటీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.

