కలం, నల్లగొండ: దేశ సమగ్ర అభివృద్ధికి విద్యాలయాలే దీప స్తంభాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MG University) ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” లో భాగంగా నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో వారం రోజుల పాటు నిర్వహించిన విద్యా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం జరిగిన ముగింపు సమావేశానికి వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన విశ్వవిద్యాలయ దీర్ఘకాలిక ప్రణాళికను విడుదల చేసి సభికులకు వివరించారు. విద్య ద్వారానే వ్యక్తి, కుటుంబం, సమాజం రూపాంతరం చెందుతాయని, గ్రామీణ ప్రాంతాల సాధారణ విద్యార్థులకు కూడా నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే ధ్యేయంగా సంస్థాగత ప్రణాళికలను అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం (MG University) స్వల్ప, దీర్ఘకాల ఇన్సిట్యూషనల్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా క్యాంపస్లో పలు అభివృద్ధి పనులను దశలవారీగా చేపట్టనున్నట్లు వీసీ వివరించారు. బోధనలో ‘ఔట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్’, నూతన పాఠ్య విధానాలు, రిమీడియల్ టీచింగ్, మెంటరింగ్ సిస్టమ్లను బలోపేతం చేయడంలో అధ్యాపకులు కీలక పాత్ర పోషించాలని వీసీ పిలుపునిచ్చారు.
అలాగే, పరిశోధనలు, నాణ్యమైన విద్యార్థి ప్రాజెక్టులు, డాక్టరల్ రీసెర్చ్ మెరుగుదలకు కృషి చేయాలన్నారు. పారదర్శక పరిపాలన, రికార్డుల నిర్వహణ, విద్యార్థి సేవల బలోపేతంలో బోధనేతర సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గ్రామీణ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యా ఫలాలు అందేలా తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియాతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముగింపు వేడుకల్లో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, స్పోర్ట్స్ బోర్డ్ డైరెక్టర్ డా. హరీష్ కుమార్, డా. శ్రీనివాసరెడ్డి, ఎస్.ఓ. బేగ్, శ్రీహరి, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also: విజయ్ నిర్ణయాన్ని గౌరవిద్దాం.. ఆ మంత్రి నియామకంపై లారెన్స్ పోస్ట్!
Follow Us On: Instagram

