కలం, వెబ్ డెస్క్: మేఘాలయలోని (Meghalaya) అక్రమ బొగ్గు గనిలో (Coal Mine) జరిగిన పేలుడులో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ఘటనలో 18 మంది మృతి చెందినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికీ పలువురు లోపలే చిక్కుకుపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈస్ట్ జైంతియా హిల్స్ జిల్లాలో గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. పేలుడు జరిగిన సమయంలో గనిలో ఎంతమంది కార్మికులు ఉన్నారన్న విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. పేలుడుకు గల కారణాలు కూడా తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “మేఘాలయ ఈస్ట్ జైంతియా హిల్స్లో (Meghalaya) జరిగిన ప్రమాదం బాధాకరం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని ప్రధాని కార్యాలయం ఎక్స్లో పోస్టు చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారం అందజేస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. మరోవైపు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా కూడా ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
Read Also: గ్లోబల్ టీచర్గా భారతీయురాలు.. కోట్లలో ప్రైజ్మనీ!
Follow Us On: Sharechat


