కలం, వెబ్డెస్క్: నిషేధిత జాబితాలో భూములను చేర్చడంపై మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో హరీశ్రావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో భూములు దోచుకొని ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసమే హరీశ్ రావు అగ్గిపెట్టె డ్రామాలు ఆడుతున్నాడని విమర్శించారు. బీఆర్ఎస్ ముఠా పదేండ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకొని భారీ భూదోపిడీ, వేల కోట్ల అవినీతికి పాల్పడి ఇప్పుడు ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు నాటకాలు ఆడుతూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హరీశ్ రావు గత పదేండ్లలో చేసిన పాపాలు, పాల పేరుతో చేసిన చీకటి వ్యాపారాలు అన్నీ తెలంగాణ ప్రజలకు తెలుసునని పొంగులేటి అన్నారు. హరీశ్ రావును అగ్గిపెట్టె రావు అని సంబోధిస్తూ సెటైర్లు వేశారు. తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్ని డ్రామాలు చేసినా ప్రజలు బీఆర్ఎస్ నాయకులను ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు. “అబద్ధాలతో అధికారంలోకి రావాలనుకుంటున్న అగ్గిపెట్టె రావు కల ఎప్పటికీ పగటి కలగానే మిగిలిపోవడం ఖాయం” అని పొంగులేటి పేర్కొన్నారు.
ఇక తమది ప్రజల ప్రభుత్వమని, కాంగ్రెస్ సర్కార్ ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తుందని పొంగులేటి స్పష్టం చేశారు. 22ఏ కారణంగా ప్రభావితమైన భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

