కలం, వరంగల్ : బీజేపీ (BJP) ఓట్ల చోరీకి ఎస్ఐఆర్ను (SIR) వినియోగించుకుంటుందని కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) ఆరోపించారు. బెంగాల్లో కూడా ఓట్ల చోరీ ద్వారానే బీజేపీ విజయం సాధించిందని, అక్కడ లక్షలాది ఓట్లను తొలగించారని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
అయితే ఈ దేశంలో పేదలకు ఓటు వేసే హక్కు కూడా లేకుండా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, దానిని ఎవ్వరూ హరించలేరని స్పష్టం చేశారు. ఓటు హక్కును లాగేసుకుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఓట్ల రక్షణలో బీఎల్ఏ ఏజెంట్ల పాత్ర అత్యంత కీలకమని, అందువల్ల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ప్రతి ఓటును కాపాడే బాధ్యత అందరిదని అన్నారు.

