కలం మెదక్ బ్యూరో: తనను కలిసేందుకు ఆటోలో వృద్ధురాలు వచ్చినట్లు తెలుసుకున్న మెదక్ (Medak) ఎస్పీ డి.వి.శ్రీనివాస రావు.. ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఆమె వద్దకే వెళ్లి వినతిపత్రం స్వీకరించారు. వివరాల్లోకి వెళితే.. కారణ్య నియామకం ద్వారా ఉద్యోగం దక్కించుకున్న పెద్ద కుమారుడు తల్లి బాగోగులను పూర్తిగా విస్మరించాడు.
ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని..
క్యాన్సర్తో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఉన్న సదరు వృద్ధురాలు సోమవారం గ్రీవెన్స్లో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయానికి ఆటోలో వచ్చింది. వయోభారం కారణంగా ఆఫీస్ లోపలకి రాలేని పరిస్థితిలో ఉందని తెలుసుకున్న ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు స్వయంగా ఆటో వద్దకు వెళ్లారు. ఆమె ఫిర్యాదు తీసుకోవడంతో పాటు ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సీఐని పిలిపించి..
అనంతరం మెదక్ టౌన్ సీఐ మహేష్ను పిలిపించి, వృద్ధురాలి ఫిర్యాదుపై వెంటనే విచారణ చేపట్టి, వాస్తవాలను నిర్ధారించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, వేధింపులకు పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తారని, తల్లిదండ్రుల సంక్షేమాన్ని చూడటం బాధ్యతగా తీసుకోవాలన్నారు.

