కలం, సూర్యాపేట: పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంతోపాటు విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యతను పెంచడమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని సూర్యాపేట (Suryapet) కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పిలుపునిచ్చారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్ (అమ్మ పేరుతో మొక్కను నాటడం)’ జాతీయ విద్యార్థి పర్యావరణ పోటీ వాల్ పోస్టర్ను ఆయన సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తన తల్లి పేరుతో ఒక మొక్కను నాటడమే కాకుండా, దానిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పచ్చదనం పెరగడమే కాకుండా, చిన్నతనం నుంచే ప్రకృతి పట్ల ప్రేమ అలవడుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతి పాఠశాలలో కనీసం 10 పండ్ల మొక్కలు నాటాలన్నారు. వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ ఆధ్వర్యంలో ఈ జాతీయ స్థాయి పర్యావరణ పోటీలను నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ పోటీల్లో పాఠశాల, కళాశాల విద్యార్థులు, పరిశోధకులు, సాధారణ పౌరులు ఎవరైనా పాల్గొనవచ్చని వివరించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ‘హరిత సూర్యాపేట’ (Suryapet ) నిర్మాణానికి సహకరించాలని కోరారు.
అనంతరం డీఈఓ అశోక్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్ రాజ్, జడ్పీ సీఈఓ శిరీష, హౌసింగ్ పీడీ సిద్ధార్థ్, డీపీవో యాదగిరి, సీపీవో కిషన్, డీఏఓ శ్రీధర్ రెడ్డి, డీఎఫ్ఓ దామోదర్ రెడ్డిలతోపాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Read Also: పాలమూరు రైతుల సోలార్ ‘పంట‘.. నెలనెలా ఆదాయం
Follow Us On : WhatsApp

