కలం, వెబ్ డెస్క్ : మాంసం ప్రియులకు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ((Telangana Chicken Shop Owners Association) భారీ షాక్ ను నిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ కంపెనీలు ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని ఆరోపిస్తూ తెలంగాణలో ఏప్రిల్ 1నుంచి చికెన్ షాపుల బంద్ (Chicken Shops Closed) నిర్వహిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ బంద్ కు సంబంధించిన ప్రచార పోస్టర్లు, ఫ్లెక్సీలను ఉప్పల్, ఎల్బీనగర్ సహా జంట నగరాల్లోని పలుచోట్ల చికెన్ వ్యాపారులు ఏర్పాటు చేశారు.
పౌల్ట్రీ కంపెనీలు తమకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించాయని, దీనివల్ల వ్యాపారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని అసోసియేషన్ ఆరోపిస్తోంది. రోజు రోజుకు చికెన్ రేటు పెరుగుతుంది కానీ తమకు ఇచ్చే మార్జిన్ తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, పౌల్ట్రీ కంపెనీలు గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువ ఇస్తున్నారని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పౌల్ట్రీ కంపెనీలు, వ్యాపారుల మధ్య చర్చలు జరిపి పరిష్కారం కనుగొనాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.మార్జిన్ పెంచకపోతే వ్యాపారం చేయలేమని.. షాపులు మూసివేస్తామని చికెన్ వ్యాపారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఎండల కారణంగా బ్రాయిలర్ కోళ్లు చనిపోతుండడంతో మార్కెట్లో సప్లై తగ్గుతోంది. దీంతో పాటు ఎండల కారణంగా కోళ్లు దాణా తక్కువ తిని నీళ్లు ఎక్కువగా తాగుతుండడంతో ఆశించినంత ఎదుగుదల ఉండడంలేదు.కోళ్లను కాపాడుకునేందుకు కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం వల్ల పౌల్ట్రీ ఫామ్స్ నిర్వాహకులపై ఆర్థికంగా అదనపు భారంగా పడుతోంది. ఈ కారణంతో చాలా మంది పౌల్ట్రీ రైతులు వేసవిలో కోళ్ల పెంపకాన్ని నిలిపివేయడంతో సప్లై చాలా వరకు తగ్గింది.ఎండలు ముదురుతుండడంతో రాష్ట్రంలో కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంతోనే చికెన్ ధర రికార్డు స్థాయికి చేరిందని, మరికొన్ని రోజుల్లో కేజీ చికెన్ రూ. 400 దాటే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
ఏది ఏమైనా ఇప్పటికే ప్రపంచ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్యాస్, పెట్రోల్ విషయాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యుద్ధ ప్రభావం వల్ల మరెలాంటి ఉపద్రవం వస్తుందోనని జనాలు భయపడిపోతున్నారు. ఈ క్రమంలోనే చికెన్ వ్యాపారులు సైతం తీసుకున్న ఈ బంద్ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను మరింత ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

