కలం, వెబ్ డెస్క్: జమ్మూ కశ్మీరులోని పుల్వామాలో (Pulwama) 2019లో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ భయంకరమైన దాడికి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ తాజాగా హతమయ్యాడు. పాకిస్థాన్ ముజఫరాబాద్లో నివసిస్తున్న బుర్హాన్ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు. పలు రౌండ్ల కాల్పులు జరపడంతో ఉగ్రవాది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వరుస ఘటనలు.. బెంబేలెత్తిపోతున్న ఉగ్రవాదులు
భారత్లో గతంలో దాడులకు పాల్పడి.. పాకిస్థాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు ఇటీవల కాలంలో ఒక్కొక్కరుగా పాకిస్థాన్లో హతమవుతుండటం చర్చకు దారి తీస్తోంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చి తమను చంపుతారోనని ఉగ్రవాదులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తోంది. ఉగ్ర స్థావరాల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. దీని వెనుక భారత గూఢచర్య సంస్థ హస్తం ఉందని పాకిస్థాన్ ఆరోపిస్తున్నా.. ఇండియా కొట్టిపారేస్తోంది. ఇటీవల విడుదలైన దురంధర్ మూవీలో ఇలాగే ఉగ్రవాదులు అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతుండటాన్ని నెటిజన్లు ఇక్కడ ఉదహరిస్తున్నారు.

