కలం, వెబ్ డెస్క్: తమిళనాడు (Tamil Nadu) కాంగ్రెస్పార్టీ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 60 ఏళ్ల తర్వాత అక్కడి రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం అయ్యింది. టీవీకే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం దక్కింది. 1967 తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రిగా అవకాశం దక్కింది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చిన్న వివాదం చోటుచేసుకున్నది.
ప్రమాణస్వీకారంలో వివాదం
కిల్లియూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎస్ రాజేష్ కుమార్ గురువారం మంత్రి పదవికి ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు కామరాజ్, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ పేర్లు ప్రస్తావిస్తూ నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వెంటనే స్పందించి, “అది మీ ప్రమాణ పత్రంలో భాగం కాదు” అంటూ హెచ్చరించారు. ఈ సంఘటనతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొన్నది. తరువాత కార్యక్రమం సాఫీగా కొనసాగింది. గవర్నర్, మంత్రి ఇద్దరూ చిరునవ్వులు చిందించడం గమనార్హం.
కాంగ్రెస్ మద్దతు కీలకం
ప్రమాణ స్వీకారం అనంతరం బయటకు వచ్చిన రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “కామరాజ్ అమర్ రహే”, “రాజీవ్ గాంధీ అమర్ రహే”, “రాహుల్ గాంధీ జిందాబాద్” అంటూ నినాదాలు చేయడం గమనార్హం. తమిళనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకే ప్రభుత్వానికి మెజారిటీ రాకపోవడంతో కాంగ్రెస్ మద్దతు కీలకంగా మారింది. డీఎంకేతో 20 ఏళ్ల అనుబంధాన్ని కాంగ్రెస్ పార్టీ వదులుకొని టీవీకేకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. మే 10న జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, గురువారం జరిగిన క్యాబినెట్ విస్తరణలో 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

