కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగర నడిబొడ్డున బుధవారం అర్ధరాత్రి భారీ దొంగతనం చోటు చేసుకుంది. నగరంలోని వైరా రోడ్డులో ఉన్న ప్రముఖ ఎలక్ట్రానిక్స్ డిజిటల్ షోరూం ‘సోనో విజన్’ లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు పెద్ద ఎత్తున లూటీకి పాల్పడ్డారు. షోరూం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, అక్కడ ప్రదర్శనలో ఉంచిన సుమారు 200 విలువైన సెల్ఫోన్లను అపహరించుకుపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
దొంగతనానికి గురైన మొబైల్ ఫోన్ల విలువ లక్షల్లో ఉంటుందని భావిస్తున్నారు. గురువారం ఉదయం షోరూం తెరిచేసరికి లోపల సామాగ్రి చెల్లాచెదురుగా పడి ఉండటం, మొబైల్స్ మాయమవ్వడాన్ని గమనించిన యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించి, క్లూస్ టీమ్ సహాయంతో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. షోరూం లోపల, వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పక్కా ప్లాన్తోనే దుండగులు ఈ చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సోనో విజన్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో అత్యంత రద్దీగా ఉండే వైరా రోడ్డులో ఇంతటి భారీ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

