కలం, వెబ్ డెస్క్ : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల (Tirumala) కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి 18గంటలకు పైగా సమయం పట్టనుంది. భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో క్యూలైన్లు కృష్ణ తేజ సర్కిల్(Krishna Teja Circle) వరకు పొడిగించారు. పెద్ద ఎత్తున భక్తులు క్యూలైన్లలో నిలబడి స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, అలిపిరి టోల్ ప్లాజా (Alipiri Toll Plaza) వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి వాహనాన్ని భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఒక్కో వాహనాన్ని తనిఖీ చేయడానికి సుమారు 3 నుంచి 5 నిమిషాల సమయం పడుతుండటంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఇక ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

