కలం, వెబ్ డెస్క్ : నిర్మల్ నుంచి నెల్లూరుకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ప్రమాదానికి గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులకు జరిగిన నష్టం తీరనిదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు రంగంలోకి దిగారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఫోన్లో మాట్లాడి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలపై సమన్వయం చేసుకున్నారు.

