కలం, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh)కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ రావడం కలకలం రేపింది. మావోయిస్టుల పేరుతో సచివాలయంలోని మంత్రి పేషీకి ఓ లేఖ వచ్చింది. ఇందులో మంత్రి కందుల దుర్గేష్ను కుటుంబంతో సహా చంపేస్తామని పేర్కొన్నారు. ఈ లేఖపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో మంత్రి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అసలు ఈ లేఖ నిజంగానే మావోయిస్టులు రాశారా? ఎవరైనా కావాలనే భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కందుల దుర్గేష్ ప్రస్తుతం సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో మంత్రి భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.


