కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ జలమండలి (Hyderabad Water Board) పరిధి విస్తరించిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విస్తరించిన ప్రాంతాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు ముగ్గురు అధికారులను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (Executive Directors)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా ప్రస్తుతం ఈడీగా పని చేస్తున్న అధికారికి పదోన్నతి కల్పించింది. పంకజ ప్రస్తుతం జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ఉన్నారు. ఆమెను జలమండలిలో మల్కాజిగిరి ఈడీగా నియమించారు. సామ్రాట్ అశోక్ కు జలమండలి హైదరాబాద్ ఈడీగా పోస్టింగ్ ఇచ్చారు. జలమండలి సైబరాబాద్ ఈడీగా సంతోష్ను నియమించారు. ఇక ప్రస్తుతం జలమండలిలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మయాంక్ మిట్టల్కు పదోన్నతి కల్పిస్తూ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు. జలమండలి పరిధి విస్తరణతో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లో తాగునీరు, మురుగు నీటి నిర్వహణ, కొత్త కనెక్షన్లు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి పనులు పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.


