కలం, మెదక్ బ్యూరో : ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన పార్దాపూర్ ఏరియా కమాండర్ రూపి అలియాస్ రంగబోయిన భాగ్య (Rupi Bhagya) మృతదేహం ఆమె స్వగ్రామం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామానికి రాత్రి తీసుకువచ్చారు. దాదాపు 22 ఏళ్ల క్రితం ఉద్యమ బాట పట్టి ఇల్లు వదిలివెళ్లిన భాగ్య మృతదేహాన్ని చూసి ఆమె తల్లి, సోదరి, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఈ నెల 13న ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో రూపి అలియాస్ భాగ్య (Rupi Bhagya) మృతి చెందారు. విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితురాలై 2004లో కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆమె మావోయిస్టు పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ వంటి ప్రాంతాల్లో ఆమె క్రియాశీలకంగా పనిచేశారు. రూపి ఆచూకీ తెలిపిన వారికి గతంలోనే ప్రభుత్వం 25 లక్షల రూపాయల రివార్డును కూడా ప్రకటించింది. కాగా, రూపి మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్య. విజయ్ రెడ్డి కూడా 2025లో మాన్పూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లోనే మృతి చెందారు.

