కలం, వెబ్ డెస్క్: మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాలు, మూఢనమ్మకాల (Superstition) నెపంతో ఓ వ్యక్తిని అతడి బంధువులే దారుణంగా కొట్టి చంపేశారు. జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన గుమ్ముల రాజం (50) గోదావరిలో చేపలు పట్టుకుని, విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. తన ఇంటికి సమీపంలోని గుడిలో నిత్యం పూజలు చేస్తుండేవాడు. రాజం దగ్గరి బంధువు గుమ్ముల వెంకటి కుటుంబసభ్యులు తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. దీనికి కారణం, రాజం చేస్తున్న మంత్రాలే అని బలంగా నమ్మారు. ఎలాగైనా, అతడిని చంపేయాలని హత్యకు ప్రణాళిక వేశారు.
రాళ్లతో కొట్టి.. కాలువలో పడేసి…
మంగళవారం ఆలయంలో పూజలు చేసి తిరిగి వస్తున్న రాజంను వెంకటి కుటుంబసభ్యులు అడ్డుకుని.. రాళ్లతో తలపై కొట్టి చంపేశారు. అనంతరం, మృతదేహాన్ని ఈడ్చుకెళ్లి పక్కనే ఉన్న నీటి కాలువలో పడేసి వెళ్లిపోయారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా, స్విచ్ఛాఫ్ అని వచ్చింది. తెల్లవారుజామున గోదావరి నది వద్ద వెతుకుతుండగా.. రాజం బైక్, అక్కడే రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారి విచారణలో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Read Also: ఉద్యోగుల కన్నెర్ర.. దశలవారీ నిరసనలకు క్యాలెండర్ షెడ్యూల్ ఫిక్స్
Follow Us On : WhatsApp

