కలం, నిజామాబాద్ బ్యూరో : యూరియా యాప్ ను పూర్తిగా రద్దు చేయాలనీ, ఆంక్షలు లేకుండా రైతులకు ఎకరానికి నాలుగు సంచుల యూరియాను ఒకేసారి పంపిణీ చేయాలని, సొసైటీలో షాపుల్లో సరిపడా యూరియా విరివిగా ఉంచాలని డిమాండ్తో బాల్కొండ నియోజకవర్గం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో NH 63 వేల్పూర్ X రోడ్ పై రైతులు భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) పాల్గొని రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు.
ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న నేడు కడుపు మంటతో, ఆవేదనతో రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన దుస్థితిని రేవంత్ రెడ్డి కల్పించారని ధ్వజమెత్తారు. “ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం” ఎన్నటికీ ముందడుగు వేయలేదని, రైతులు లేకపోతే రాజ్యమే లేదని వ్యాఖ్యానించారు.. ప్రస్తుత ప్రభుత్వంలో రైతులు ప్రతి చిన్న అవసరానికి, హక్కుల కోసం రోడ్లెక్కి కొట్లాడాల్సి వస్తోందన్నారు. అలాంటి దారుణమైన పరిస్థితి నేడు రాష్ట్రంలో దాపురించిందని ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ సీఎం కేసీఆర్ హయాంలో రైతులను కంటికి రెప్పలా, గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు.. కొత్తగా ప్రవేశపెట్టిన యాప్ విధానం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిని తక్షణమే రద్దు చేయాలని వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అవసరమైన యూరియాను ఎకరానికి 4 సంచుల చొప్పున ఒకేసారి సకాలంలో అందించాలన్నారు.

