కలం, వెబ్డెస్క్: కాంగ్రెస్ క్రమ శిక్షణ కమిటీ (Congress Disciplinary Committee) సమావేశంలో మూడు గంటల పాటు ప్రధానంగా మూడు విషయాలపై చర్చించినట్లు కమిటీ అధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. ఇందులో ఎక్కువ సేపు కొండా సురేఖ (Konda Surekha) గురించే చర్చించినట్లు వెల్లడించారు. క్రమ శిక్షణ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అందరూ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వెంటనే తుది నిర్ణయం తీసుకోకుండా మరో సారి కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు తెలిపారు.
చిన్నారెడ్డి మాట్లాడిన విషయంపై వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. ఈ ఫిర్యాదుపై నేడు చిన్నారెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిపారు. ఆ వివరణ కూడా పరిశీలించామన్నారు. చిన్నారెడ్డి మాట్లాడిన అంశాలను పెన్డ్రైవ్ రూపంలో కూడా ఇచ్చారన్నారు. దీన్ని కమిటీ పరిశీలించిందని తెలిపారు. చిన్నారెడ్డి వివరణకు, మేఘారెడ్డి ఫిర్యాదుకు చాలా తేడా ఉందన్నారు. మరోసారి వారి వివరణ తీసుకొని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇక కొండా సురేఖ వివరణపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కొండా సుస్మిత సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించామన్నారు. సీఎంను తిడితే కొండా సురేఖ ఖండించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇక రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదన్నారు.

