కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ఆదివారం ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓ నియంత అని, ఆయన చెప్పినట్లు నడుచుకుంటూ మోదీ (PM Narendra Modi) ‘బానిస’లాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాణిజ్యం పేరుతో ట్రంప్ మోడీని తన నియంత్రణలో ఉంచుకున్నారని ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని చిత్తాపూర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే.. ట్రంప్, మోడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల వల్ల భారతీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, దేశాన్ని అమెరికా ప్రయోజనాల కోసం మోడీ తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
అంతర్జాతీయ అంశాలపై స్పందిస్తూ.. ఇతర దేశాల నాయకుల హత్యలు, అమెరికా వ్యవహారశైలిని ఖర్గే తప్పుబట్టారు. ఇరాన్, వెనిజులా వంటి దేశాల నాయకులను బెదిరించడం ప్రపంచ శాంతికి భంగకరమని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో భారత్ తన ఇంధన అవసరాల కోసం రష్యా, ఇరాన్ వంటి దేశాల నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకునేదని, కానీ నేడు ట్రంప్ ఆదేశాల మేరకు చమురును కొనాల్సి వస్తోందని విమర్శించారు. ఇలాంటి విధానాలతో ప్రధాని మోడీ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఖర్గే ధ్వజమెత్తారు.

