కలం, వెబ్డెస్క్: దేశంలో గత పన్నెండేళ్లుగా పెన్షన్ల పెంపు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖర్గే ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. దేశ ప్రజలకు పొదుపు, త్యాగాల గురించి హితబోధ చేసే ప్రధాని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. గత పన్నెండేళ్లుగా పెన్షన్లను ఒక్క పైసా కూడా పెంచకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల వల్ల గతంలో ఇచ్చే రూ.200 పెన్షన్ ఇప్పుడు రూ.110 కి సమానమని ఖర్గే వ్యాఖ్యానించారు.
ప్రధాని మోదీకి (PM Modi) పెన్షన్లు పెంచడంలో శ్రద్ధ లేదు కానీ ప్రజా ధనాన్ని ప్రచారాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని ఆరోపించారు. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం కోట్లాది రూపాయలను కేవలం ప్రచారాలు, ప్రకటనల కోసమే ఖర్చు పెడుతోందని, దాదాపు రూ.1.5 కోట్లు దీనికే వృధాగా ఖర్చవుతున్నాయని చెప్పారు. ఇలా 2014 నుంచి 2025 వరకు బీజేపీ ప్రభుత్వం స్వప్రచారాల కోసం అక్షరాలా రూ. 5,987.46 కోట్లు ఖర్చు చేసిందని గణాంకాలు బయటపెట్టారు. ఒక పక్క పేదలకు కడుపు నిండా తిండి దొరకడం లేదని, మరోపక్క మోదీ విలాసవంతమైన ఎన్నికల ప్రచారాలు, భారీ ఈవెంట్లు, కాన్వాయ్లకు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అణగారిన వర్గాల ఆర్థిక గౌరవాన్ని హరిస్తూ, రాజకీయ ఆడంబరాల కోసం ఖర్చు చేసే ఈ బీజేపీ మోడల్ దేశానికే ప్రమాదకరమని ఖర్గే (Mallikarjun Kharge) తన పోస్టులో పేర్కొన్నారు.
Read Also: జన జీవన స్రవంతిలోకి మావోయిస్టు అగ్రనేత!
Follow Us On: Pinterest

