కలం, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి ఆలయం (Basara Saraswathi Temple)లో భారీ చోరీ జరిగింది. మంగళవారం ఉదయం పూజలు, అభిషేకం చేసేందుకు వెళ్లిన అర్చకులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు దొంగలు వ్యాస మహర్షి ఆలయం వెనుక నుంచి మొదటి అంతస్తులో ఉన్న మహంకాళీ ఆలయంలోకి చొరబడ్డారు. ముఖాలకు గుడ్డలు కట్టుకొని, ఆలయంలో ఉన్న మూడు సీసీ కెమెరాలపై గుడ్డలు కప్పి ఈ చోరీ చేశారు. ఆలయం తలుపులు పగులగొట్టిన దుండగులు అమ్మవారి వెండి కిరీటం, హుండీని అపహరించారు. అయితే ముక్కు పుడక, ఇతర బంగారు ఆభరణాలు అలాగే వదిలివేయడం గమనార్హం.
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ చోరీ జరిగింది. చోరీ జరిగిన సమయంలో రాత్రి డ్యూటీలో ఆరుగురు హోం గార్డులు ఉన్నారు. ఇంత సెక్యురిటీ మధ్య చోరీ జరగడం తీవ్ర అనుమానాలకు తావిస్తోంది. అర్చకుడు శ్రీను సమాచారం మేరకు పోలీసులు ఆలయానికి చేరుకొని పరిశీలించారు. వేద వ్యాస గుహ దగ్గర గుట్టల్లో ఖాళీ హుండీ లభ్యమైంది. దొంగలు డబ్బులు తీసుకొని ఖాళీ హుండీని అక్కడే పడేసి వెళ్లిపోయారు. అర్చకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం స్థానిక సీసీ కెమెరా ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. ఆలయంలో (Basara Temple) చోరీ జరగడంతో హుండీ లెక్కింపును ఈవో వాయిదా వేశారు. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.
Read Also: రమ్మంటున్న కేటీఆర్.. రానంటున్న కేసీఆర్!
Follow Us On: Instagram

