కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమరవీరులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోట్లాది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని, అనేక త్యాగాలు, పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, రైతులు, మహిళలు, మేధావులు సహా అన్ని వర్గాల ప్రజలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసిందని అమర వీరుల త్యాగాలకు చలించిన తల్లి సోనియమ్మ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగినా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సామాజిక, ఆర్థిక, విద్యా రంగాల్లో మరింత అభివృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి అనే తెలంగాణ ఉద్యమ ఆశయాలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా ఉంచుకుంటూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పథంలో రాష్ట్రం మరింత ముందుకు సాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

