కలం, నిజామాబాద్ బ్యూరో: యువత ఒలింపిక్ స్ఫూర్తిని అలవర్చుకుని క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. నిజామాబాద్ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన 40వ ఒలింపిక్ డే రన్–2026 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత క్రమశిక్షణ, ఐక్యత, శాంతి, ఆరోగ్యకర జీవన విధానాన్ని పాటించాలని సూచించారు.
క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచుకోవచ్చన్నారు. సాధన చేసి దేశం, రాష్ట్రానికి గొప్ప కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంలో జిల్లా ఒలింపిక్ సంఘం చేస్తున్న సేవలను అభినందించారు. అనంతరం ఒలింపిక్ డే రన్కు జెండా ఊపి ప్రారంభించి, క్రీడాకారులతో కలిసి కొంతదూరం పరుగెత్తి వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, ఆకుల లలిత, కేశ వేణు, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

