కలం, వెబ్ డెస్క్ : దేశ అత్యున్నత నిఘా సంస్థ ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నూతన చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేష్ దీక్షిత్ (Mahesh Dixit) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐబీలోనే స్పెషల్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన, ప్రస్తుత డైరెక్టర్ తపన్ కుమార్ దేకా స్థానంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మహేష్ దీక్షిత్ ఈ అత్యున్నత పదవిలో కొనసాగుతారు.
మహేష్ దీక్షిత్ (Mahesh Dixit) 1993 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. దేశ రక్షణ, నిఘా విభాగాలలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన కశ్మీర్లో ఐబీ జాయింట్ డైరెక్టర్గా (JD) సేవలందించారు. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన కీలక సమయంలో అక్కడ శాంతిభద్రతల పరిరక్షణ, వ్యూహాత్మక నిఘా వ్యవహారాలను పర్యవేక్షించడంలో మహేష్ దీక్షిత్ అత్యంత కీలక పాత్ర పోషించారు. దేశ భద్రతా రంగంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది.

